Monday, 23 March 2026

నామ జపం

కలి యుగంలో, ముక్తికి నామ జపానికి మించినదేది లేదని పెద్దలు చెబుతూంటారు.  ఐతే, నామ జపం ప్రాముఖ్యత గురించి ఎవరు చెప్పారు అని ఆలోచిస్తే, దొరికిన సమాధానమిది.

*పురాణాలు*

నారద పురాణము(1.1.41.115)లో సనక ఋషి నారదునితో అన్న మాటలు.

హరేర్నామైవ నామైవ నామైవ మమ జీవనమ్

కలౌ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథా

నా జీవితమంతా హరి నామము తప్ప ఇంకొకటి లేదు.  కలి యుగంలో హరినామమే ముక్తిని ప్రసాదించగలదు.

----

పురాణాలకన్న ముందు, రామాయణంలో *రామనామ జపం* సీత చేసినట్లుగా, సుందరకాండలో ఉంది.

శ్రీహనుమంతుడు శింశుపా వృక్షంపైనుండి శ్రీరామ కథను వినిపించినపుడు సీత మనోగతం.

రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచిన్త్యా వాచా బ్రువతీ తమేవ |

తస్యానురూపం కథాం తదర్థా మేవం ప్రపశ్యామి తథా శృణోమి || 5-32-11

"నేను రాముని గురించి మాత్రమే మనస్సుతో ఆలోచిస్తున్నాను, మరియు ఎల్లప్పుడూ 'రామా! రామ!'అని అంటున్నాను. అందువల్ల, అతని ఆలోచనకు అనుగుణంగా నేను ఒక కథను చూస్తున్నాను మరియు వింటున్నాను."

---

ఐతే, ఋగ్వేదంలో (1.24.2) కూడా నామజపం ప్రాముఖ్యత గురించి, శునశేప ఆజీగర్తి ఋషి ప్రస్తావించారు.

ఇక్కడ *అగ్ని* అంటే పరబ్రహ్మం అని అర్థం చేసుకోవాలి.

 

అగ్నేర్వయం ప్రథమస్యామృతానాం *మనామహే* *చారు* దేవస్య నామ  

నో మహ్యా అదితయే పునర్దాత్పితరం దృశేయం మాతరం

అమృతత్వం కలిగిన వారిలో మొదటివాడైన (ప్రథమస్యామృతానాం) అగ్నిదేవునియొక్క (దేవస్య) సుందరమైన (చారు) నామాన్ని, నిరంతరం తదేకదీక్షతో మనమందరము చేద్దాము (*మనామహే* వయం).  అప్పుడు, అగ్ని నన్ను, (దేవమాతైన) అదితి మరల చేరుస్తాడు (మహ్యా అదితయే పునర్దాత్). అందువలన, తల్లిదండ్రుల దర్శనం (పితరం దృశేయం మాతరం ) అవుతుంది.

---

తల్లిదండ్రుల దర్శనం అవడమంటే, అర్థనారీశ్వరతత్వం అనుభవంలోకి వస్తుందని, అంటే స్త్రీపురుష తత్వాలకు అతీతమైన ఆత్మసాక్షాత్కారం అవుతుందని,  అర్థం చేసుకోవచ్చును. 

No comments:

Post a Comment