ఈ కలి యుగంలో, ముక్తికి నామ జపానికి మించినదేది లేదని పెద్దలు చెబుతూంటారు. ఐతే, నామ జపం ప్రాముఖ్యత గురించి ఎవరు చెప్పారు అని ఆలోచిస్తే, దొరికిన సమాధానమిది.
*పురాణాలు*
నారద పురాణము(1.1.41.115)లో సనక ఋషి నారదునితో అన్న మాటలు.
హరేర్నామైవ నామైవ నామైవ మమ జీవనమ్ ।
కలౌ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథా ॥
నా జీవితమంతా హరి నామము తప్ప ఇంకొకటి లేదు. ఈ కలి యుగంలో హరినామమే ముక్తిని ప్రసాదించగలదు.
----
పురాణాలకన్న ముందు, రామాయణంలో *రామనామ జపం* సీత చేసినట్లుగా, సుందరకాండలో ఉంది.
శ్రీహనుమంతుడు శింశుపా వృక్షంపైనుండి శ్రీరామ కథను వినిపించినపుడు సీత మనోగతం.
రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచిన్త్యా వాచా బ్రువతీ తమేవ |
తస్యానురూపం చ కథాం తదర్థా మేవం ప్రపశ్యామి తథా శృణోమి || 5-32-11
"నేను ఆ రాముని గురించి మాత్రమే మనస్సుతో ఆలోచిస్తున్నాను, మరియు ఎల్లప్పుడూ 'రామా! రామ!'అని అంటున్నాను. అందువల్ల, అతని ఆలోచనకు అనుగుణంగా నేను ఒక కథను చూస్తున్నాను మరియు వింటున్నాను."
---
ఐతే, ఋగ్వేదంలో (1.24.2) కూడా నామజపం ప్రాముఖ్యత గురించి, శునశేప ఆజీగర్తి ఋషి ప్రస్తావించారు.
ఇక్కడ *అగ్ని* అంటే పరబ్రహ్మం అని అర్థం చేసుకోవాలి.
అగ్నేర్వయం ప్రథమస్యామృతానాం *మనామహే* *చారు* దేవస్య నామ ।
స నో మహ్యా అదితయే పునర్దాత్పితరం చ దృశేయం మాతరం చ ॥
అమృతత్వం కలిగిన వారిలో మొదటివాడైన (ప్రథమస్యామృతానాం) అగ్నిదేవునియొక్క (దేవస్య) సుందరమైన (చారు) నామాన్ని, నిరంతరం తదేకదీక్షతో మనమందరము చేద్దాము (*మనామహే* వయం). అప్పుడు, అగ్ని నన్ను, (దేవమాతైన) అదితి మరల చేరుస్తాడు (మహ్యా అదితయే పునర్దాత్). అందువలన, తల్లిదండ్రుల దర్శనం (పితరం దృశేయం మాతరం చ) అవుతుంది.
---
తల్లిదండ్రుల దర్శనం అవడమంటే, అర్థనారీశ్వరతత్వం అనుభవంలోకి వస్తుందని, అంటే స్త్రీపురుష తత్వాలకు అతీతమైన ఆత్మసాక్షాత్కారం అవుతుందని, అర్థం చేసుకోవచ్చును.
No comments:
Post a Comment